Rahul Gandhi Comments on TRS: తెరాసతో పొత్తు లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. పొత్తుల గురించి కాంగ్రెస్లో ఎవరు మాట్లాడినా బహిష్కరిస్తామని హెచ్చరించారు. తెరాస, భాజపాతో అనుబంధముండే వాళ్లు కాంగ్రెస్లో ఉండొద్దని సూచించారు. తెరాసపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఒక వ్యక్తి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజల సొమ్ము వేల కోట్లు మింగింది ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ‘వచ్చే ఎన్నికల్లో తెరాస, భాజపాను ఓడిస్తాం. తెరాస, భాజపాతో కాంగ్రెస్ నేరుగా పోరాడుతుంది. తెలంగాణ యువతను మోసం చేసిన వారిని గద్దె దించుతాం. ప్రజల అభిమానం పొందిన వారికే ఈసారి టికెట్లు ఇస్తాం.
నిజమైన ప్రజాసేవ ఎవరు చేస్తున్నారో పార్టీ గమనిస్తోంది. ప్రజల మధ్య ఉండని వారికి ఈసారి టికెట్లు దక్కవు. కాంగ్రెస్ విధివిధానాలను విమర్శిస్తే ఊరుకునేది లేదు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు పిలిచినా వస్తాను. తెరాసపై నా పోరాటం కూడా కొనసాగుతుంది.’ తెరాస, భాజపా ఇప్పటికే కలిసి పనిచేశాయని… ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ ప్రభుత్వానికి తెరాస సహకరిస్తోందని విమర్శించారు. మోదీ 3 నల్ల చట్టాలను తీసుకొస్తే తెరాస సహకరించిందని మండిపడ్డారు. తెలంగాణలో సొంతంగా గెలవలేమని భాజపాకు తెలుసని అన్నారు.
తెలంగాణలో తెరాస అధికారంలో ఉండాలని భాజపా భావిస్తోందని… గులాబీ పార్టీ రిమోట్ కమలం పార్టీ చేతిలో ఉందని చెప్పారు. ప్రజలు తెరాసకు రెండుసార్లు అవకాశం ఇచ్చారని రాహుల్ గాంధీ అన్నారు. రెండుసార్లు అవకాశమిచ్చినా ప్రజల కోరిక నెరవేర్చలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని… తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ తప్పక నెరవేరుస్తుందని రాహుల్ హామీ ఇచ్చారు.
Also Read…
Rahul Gandhi: వరంగల్ డిక్లరేషన్ కచ్చితంగా అమలవుతుంది.. హామీ ఇస్తున్నా