Rahul Gandhi at Warangal: తెరాస ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హనుమకొండలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న రాహుల్ వరంగల్ డిక్లరేషన్ కచ్చితంగా అమలవుతుందని ప్రకటించారు.
తెలంగాణ సులువుగా ఏర్పడిన రాష్ట్రం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. హనుమకొండలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఎంతో మంది త్యాగాల మీద తెలంగాణ సాకారమైందని ఈ సభలో రాహుల్ వెల్లడించారు. తెలంగాణ ఒక వ్యక్తి, ఒక కుటుంబం కోసం ఏర్పాటు చేయలేదని తెలిపారు. రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు గడిచినా ప్రజల కష్టాలు తీరలేదని అన్నారు. తెలంగాణ ప్రజల కలలను ఈ సర్కార్ నెరవేర్చలేదని ఆరోపించారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదని ఆవేదన చెందారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్ ఎంతో పోరాటం చేసిందని వెల్లడించారు. ఆత్మదానాలకు చలించిపోయి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసీ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ ఇస్తే రైతులు, ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించామన్నారు. ప్రజలు, నిరుద్యోగులు, కాంగ్రెస్ ఆశించిందేదీ నెరవేరలేదు. రైతుల సమస్యలను తెరాస ప్రభుత్వం వినిపించుకోవట్లేదు. దేశంలో, రాష్ట్రంలో పంటలకు మద్దతు ధర దొరకట్లేదు. చరిత్రాత్మకమైన వరంగల్ డిక్లరేషన్ను ప్రకటిస్తున్నా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఏ ఆశయంతో తెలంగాణ ఇచ్చామో అది సాధిస్తాం. ఎకరానికి రూ.15 వేలు నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తాం. వరంగల్ డిక్లరేషన్ కచ్చితంగా అమలవుతుందని హామీ ఇస్తున్నానని అన్నారు.
Also Read…